10 June, 2026 | 12:44 AM

బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం ముమ్మాటికీ బీఆర్‌ఎస్ ఘనతే

10-06-2026 12:00 AM

ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

కుత్బుల్లాపూర్, జూన్ 9 (విజయక్రాంతి): బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం ముమ్మాటికీ బిఆర్‌ఎస్ ఘనతనే అని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన  ఫ్లై  ఓవర్ ను బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభివృద్ధి పనుల విషయంలో  కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు.

బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి ఘనత బిఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలసత్వాన్ని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రశ్నించినందుకే ఈ బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు  పూర్తయి అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన కొట్లాడి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేసే ఏకైక పార్టీ  బిఆర్‌ఎస్ అన్నారు.

ముఖ్యమంత్రి ఆగ మేఘాల మీద  శంకుస్థాపనలు చేసి ఎక్కడో మియాపూర్ లో ఉంటూ  బాచుపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించడం కుత్బుల్లాపూర్ ప్రజలను అవమానించడమే అని మండిపడ్డారు. ఎస్ ఎన్ డి పి, ఎస్ ఆర్ డి పి  పేరుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన  పనులకు హెచ్ - సిటి అంటూ పేరు మార్చడం తప్పా చేసింది ఏం లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు సుచిత్ర - కొంపల్లి ఫ్లైఓవర్ పనులను  పూర్తి చేయలేకపోయింది.

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం నెపాన్ని నెట్టివేసి చేతులు దులుపుకుంటున్నారే తప్పా చేసిందేమీ లేదని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తన ఊహల నగరమైన  ఫోర్త్ సిటీని ప్రచారం చేస్తూ ఉన్న నగరాన్ని విస్మరిస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం తో పాటు  హైదరాబాద్ ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీయే రక్షని స్పష్టం చేశారు.

మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత ః ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 - సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని రాజుల స్వామి నగర్, సిద్దార్థ్ నగర్, జై శ్రీరామ్ నగర్, మరాఠీ బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలపై బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా రాజుల స్వామి నగర్లో భూగర్భ డ్రైనేజీ అవుట్ లెట్ సమస్య, సిద్ధార్థ నగర్ లో  భూగర్భ డ్రైనేజీ సమస్యతో పాటు శానిటేషన్ సమస్య,  వరద నీటి సమస్య, జై శ్రీరామ్ నగర్ లో సీసీ రోడ్డు  సమస్యతో పాటు నాలా సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పారిశుధ్య నిర్వహణ,  భూగర్భ డ్రైనేజీ పనులలో అధికారుల నిర్లక్ష్య వైఖరి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 12 ఏళ్ల కాలంలో  కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ ను ఎంతో అభివృద్ధి పరిచామని, అభివృద్ధి అనేది  నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.  రానున్న రోజుల్లో కూడా  కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ తో పాటు  అన్ని ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లావణ్య, ఈఈ సుబ్రహ్మణ్యం, డీజీఎం శ్రావణి, వివిధ విభాగాల అధికారులు, స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, పోలే శ్రీకాంత్, వారాల వినోద్, రాజ్ కుమార్ ముదిరాజ్, కోల శ్రీకాంత్ ముదిరాజ్, గుబ్బల లక్ష్మీ నారాయణ, రవి, వేణు, మరాటి అశోక్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్వామి, చందు,గట్టు అశోక్ తదితరులు పాల్గొన్నారు.