చిన్నారి మృతి విషాదకరం
- బడుగులపై దాడులపై తీవ్రంగా పరిగణిస్తాం
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
కలెక్టర్, ఎస్పీలతో కలిసి కుమ్మెర గ్రామం సందర్శన
బాధితులకు పరామర్శ
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనలో రెండు నెలల చిన్నారి మృతిచెందడం అత్యంత విషాదకరమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, టీ. సురేందర్, బాలలక్ష్మి తదితరులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించి, అధికారులతో ఘటన పూర్వాపరాలపై సమగ్రంగా ఆరా తీశారు. చిన్నారి సమాధి వద్ద నివాళులు అర్పించి, అనంతరం తల్లిదండ్రులు గణేష్, మౌనికలను పరామర్శించారు. మల్లన్న జాతరకు సుమారు 10 వేల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదికలను కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ శాఖ నుంచి కోరినట్లు పేర్కొన్నారు.
నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కమిషన్ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దోషులు ఎవరైనా చట్టపరంగా కఠినంగా శిక్షించాల్సిందేనని, పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం గత మూడు రోజులుగా చేపట్టిన చర్యలను కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కమిషన్కు వివరించారు.




