13-12-2024 01:59:02 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవలేదని వెల్లడించారు.
తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50 శాతానికి పైగాప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వందశాతం మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని తెలిపారు. హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదని స్పష్టంచేశారు. ఎవరు చెరువులను ఆక్రమించినా వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్క్ నిర్మాణం చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే బోనస్లో రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూరుతుందని వివరించారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజు లు జరగాలన్న నిబంధన లేదని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో రూ.64 వేల కోట్ల అసలు, వడ్డీ కట్టామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఏడాదికి రూ.6,400 కోట్లు ఉంటే, ప్రస్తుతం ఏడాదికే రూ.64 వేల కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు. తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని, అందుకే ప్రచారంలో వెనుకబడ్డామని అన్నారు.
పదేళ్ల తర్వాత హాస్టళ్లకు ఇచ్చే డైట్ ఛార్జీలు పెంచామని తెలిపారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలనను తమ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.