17-10-2025 12:00:00 AM
వెంకటాపూర్(రామప్ప) అక్టోబరు 16 (విజయక్రాంతి) : పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులైన బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును మంత్రి సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని, పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని, ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతుకూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు.
రైతును రాజుగా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.
అలాగే, 7లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి
ములుగు, వెంకటపూర్, అక్టోబరు 16 (విజయక్రాంతి) : రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలనీ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.గురువారం వెంకటాపూర్ మండలం పాలంపేటలోని హరిత కాటేజ్ లో వరల్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ శిక్షణలో భాగంగా గత తొమ్మిది రోజులుగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, తెలంగాణ టూరిజం తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నడుస్తున్న ఈ శిక్షణా శిబిరాన్ని మంత్రి సీతక్క సందర్శించారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించి శిక్షణ తీసుకుంటున్న వాలంటీర్స్ తో ముఖాముఖి మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క కాకతీయుల చరిత్ర గురించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రం, విదేశాల నుండి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తన జీవితంలో ఏ విధంగా ఈ స్థితికి వచ్చాను ఇక్కడున్న ప్రాంత ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు,మీరు ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక మీ ప్రదేశాల్లో కాకతీయుల గురించి వివరించాలని అన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ వరుసగా ఇది నాలుగవసారి వరల్ హెరిటేజ్ క్యాంప్ రామప్పలో నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం వివిధ ప్రదేశాల నుండి వివిధ దేశాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు కాకతీయుల కళా సంపద వారసత్వం వాటిని ఎలా కాపాడుకోవడం అనే అంశాల మీద మరియు వాటి ప్రాముఖ్యతను వివరించారు.