26-06-2025 01:09:27 AM
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్
కామారెడ్డి, జూన్ 25 (విజయ క్రాంతి): తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకినాలా అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులకు, విద్యాభిమానులనుకోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాల ఆవరణలో ఈనెల 27న తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమం కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించి ఉపాధ్యాయులతో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యా కార్పోరేటీకరణను, కాషాయీకరణను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని అన్నారు.
పాఠశాల విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే విధానాన్ని మానుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 10 శాతం రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% నిధులు విద్యకు కేటాయించాలని అన్నారు,రాష్ట్రంలో విదేశీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతించ కూడదని పేర్కొన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో తెచ్చిన 25 జీవో నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు,
ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని ,నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగంలో ఉన్న 30 వేల పాఠశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని,అన్ని ప్రాథమిక పాఠశాలలో ప్రమాణాలు గల పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి అందుకు సుశిక్షితులైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను ను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవుల, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, డిటిఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి విజయరామరాజు, టీటీయూ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, ఎస్ జి టి యు జిల్లా అధ్యక్షుడు రాము, నరేందర్, శ్యామ్, నారాయణ, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.