గుంపెనగూడెం ప్రజల కల సాకారం..
రూ.4 లక్షలతో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ
చర్ల, జులై 17(విజయక్రాంతి): చర్ల మండలం గుంపెనగూడెం గ్రామంలో దశాబ్దాలుగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. సుమారు 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ పనులు భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు ప్రత్యేక చొరవతో పూర్తయ్యాయి. చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో గ్రామంలో విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలు ,
ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను ఆధునీకరించారు. దీంతో గ్రామ ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్రహ్మానంద రెడ్డి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






