calender_icon.png 10 January, 2026 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది కూర్పే సవాల్

10-01-2026 02:10:05 AM

కీపర్‌గా రాహుల్, పంత్‌కు నో ప్లేస్

  1. నితీశ్, సుందర్‌లో ఒకరికే చోటు
  2. న్యూజిలాండ్‌తో తొలి వన్డే

* టీమిండియా ఫైనల్ కాంబినేషన్ ఎప్పుడూ తలనొప్పే... ప్రతీ ప్లేస్ కోసం కనీసం ఇద్దరు రేసులో ఉండడంతో తుది జట్టు ఎంపికే పెద్ద ఛాలెంజ్‌గా మారింది. పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని పేస్ లేదా స్పిన్ ఆల్ రౌండర్ల ఎంపికతో పాటు జట్టు ఇద్దరు వికెట్ కీపర్లు ఉండడం మరొక సమస్యగా మారింది. అయితే వన్డేల్లో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు కొనసాగిస్తుండడంతో పంత్‌కు చోటు దక్కడం కష్టమే. 

తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా) :

శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రెడ్డి/ వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, జడేజా, కుల్దీప్, సిరాజ్, అర్షదీప్, హర్షిత్ రాణా

వడోదరా, జనవరి 9 : దాదాపు మూడు వారాల విరామం తర్వాత టీమిండియా క్రికెట్ సీజన్ మొదలైంది. న్యూజిలాండ్‌తో  కొత్త ఏడాదిలో తన బిజీ క్రికెట్ షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతోంది. మొదట మూడు వన్డేల సిరీస్, తర్వాత ఐదు టీ ట్వంటీ మ్యా చ్‌ల సిరీస్ ఆడబోతోంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు వడోదర ఆతిథ్యమిస్తుండగా.. భారత తుది జట్టు కూర్పు సవా ల్‌గా మారింది. నిజానికి గత కొంతకాలంగా జట్టులో ప్రతీ ప్లేస్‌కూ కనీసం ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతుండడంతో 15 మంది ఎంపిక ఒక ఛాలెంజ్‌గా ఉంటే.. తుది జట్టు కూర్పు మరో  తలనొప్పిగా ఉంటోంది.

న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా జరగబోయే తొలి వన్డేలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. 9 స్థానాల వరకూ పెద్దగా ఇబ్బంది లేకున్నా మిగిలిన రెండు స్థానాలపైనే సస్పెన్స్ నెలకొంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు గిల్ లేకపోవడంతో అప్పుడు జైస్వాల్‌కు చోటు దక్కింది. ఇప్పుడు గిల్ రాకతో జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. వన్ డౌన్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దిగనుండగా.. చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ నాలుగో ప్లేస్‌లో ఆడడం ఖాయం.

అయితే ఐదో ప్లేస్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితీశ్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచే పోటీ నెలకొంది. పిచ్ పరిస్థితిని బట్టి పేస్ ఆల్ రౌండర్ కావాలనుకుంటే నితీశ్, స్పిన్ ఆల్ రౌండర్ కావాలనుకుంటే సుందర్‌ను తీసుకుంటారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆరో స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనున్నాడు. అంతేకాదు రాహుల్‌కే కీపింగ్ బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గానూ, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్ గానూ బరిలోకి దిగడం ఖాయం. అటు బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు హర్షిత్ రాణా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్‌కు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శనలతో మళ్లీ ఫామ్ అందుకున్న ఈ హైదరాబాదీ పేసర్ మూడు వన్డేల సిరీస్‌లో కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

వచ్చే ఏడా ది జరిగే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉం డాలంటే సిరాజ్‌కు ఈ సిరీస్ నుంచే అగ్నిపరీక్ష మొదలైనట్టేనని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నప్పటకీ సొం తగడ్డపై ఆడుతుండడం భారత్‌కు అడ్వాంటేజ్. పైగా గత రికార్డులను చూస్తే వన్డేల్లో ముఖాముఖి తలపడినప్పుడు టీమీండియాదే పైచేయిగా ఉంది.