డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం
- ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడాలి
- సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు.
యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ‘మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినం’ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను విచ్చిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. అంతే కాకుండా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తాయన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణాను అరికట్టేందుకు అవగాహన, అప్రమత్తత, సామాజిక బాధ్యత ఎంతో అవసరమని సీఎం పేర్కొన్నారు.






