27 March, 2026 | 4:24 AM

ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల బలోపేతమే లక్ష్యం

27-03-2026 02:49 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఖైరతాబాద్,మార్చి 26(విజయక్రాంతి): ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభు త్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన అధునాతన వైద్య పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

గతంలోనూ అనేక ఆసుపత్రులకు ఇలాంటి సదుపాయాలు కల్పించామని, రెండో దశలో భాగంగా ఈ ఏడాది మరో రెండు కోట్ల రూపాయల విలువైన వస్తువులను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రస్తుతం ప్రత్యేక దృష్టి సారించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులు, విద్యాలయాలకు కావాల్సిన కనీస పరికరాలు, సదుపాయాలు కల్పించడంలో వైఫ ల్యం చెందిందని విమర్శించారు. అందుకే తాము ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, ప్రజలకు మేలైన సౌకర్యాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెరుగైన సమాజం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.