28-10-2025 12:03:48 AM
సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు
హుజూర్ నగర్, అక్టోబర్ 27: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాస్, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం,సిపిఐ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం రైతాంగ సమస్యలపై మెమోరాండం అందజేసి మాట్లాడారు...
ఇటీవల కాలంలో అకాల వర్షాలకు వరి పంట పడిపోవడంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారని,సన్నా,చిన్న కారు రైతులు,కౌలు రైతులు అత్యధికంగా నష్టపోయిన వారిలో ఎక్కువగా ఉన్నారన్నారు.వ్యవసాయ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎకరాకు 20వేల చొప్పున చెల్లించాలన్నారు.
రైతులకు యూరియా అందక అనేక ఇబ్బందులు పడి పంట చేతికి వచ్చే సమయానికి పంట నష్టపోవడం వలన రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ 500 రూపాయలు నేటికీ చెల్లించలేదని తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు జక్కుల రమేష్,పట్టణ సిపిఐ సహాయ కార్యదర్శులు మామిడి వెంకయ్య, సోమగాని కృష్ణ, జడ వెంకన్న, చెన్నగాని సైదులు,బత్తిని మల్లయ్య,బాలబోయిన సత్యనారాయణ,బత్తిని శ్రీనివాస్, దొంతగాని వెంకటేశ్వర్లు,గుజ్జుల షంబిరెడ్డి,దొంతగాని వెంకటేశ్వర్లు, దేవరం శ్రీనివాసరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.