21-05-2025 11:15:36 PM
జాలిగామలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్..
వర్షంలో తడుస్తున్న ధాన్యాన్ని లారీలను రప్పించి ధాన్యం తరలింపు..
గజ్వేల్: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్(Additional Collector Abdul Hameed) అన్నారు. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో గల ఐకేపి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం తడుస్తుండడంతో వెంటనే లారీలను రప్పించి హమాలీలతో లారీలో వరిధాన్యాన్ని లోడ్ చేయించి మిల్లులకు పంపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హమీద్ మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు.
అకాల వర్షాలు కురుస్తున్నందున వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యం నిల్వ ఉంచకుండా వెంటవెంటనే మిల్లులకు రవాణా చేయాలని, ఆకస్మికంగా వచ్చే వర్షం నుండి ధాన్యాన్ని కవర్లతో కప్పి తడవకుండా చూడాలని సిబ్బందికి, రైతులకు సూచించారు. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు రవాణా చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకులను ఆదేశించారు. అనంతరం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి జాలిగామ గ్రామానికి చెందిన పెద్ద రైతు సుధాకర్ సుమారు 30 ఎకరాలలో వరిధాన్యాన్ని లాభదాయంగా పండించినందుకు జిల్లా అదనపు కలెక్టర్ అభినందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, తహసిల్దార్ శ్రావణ్, ఏఏంసి కార్యదర్శి జాన్ వెస్లీ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.