14-01-2026 02:42:47 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (విజయక్రాంతి): సంక్రాంతి సంబరాల్లో విషాదాన్ని నింపుతున్న చైనా మాంజా వ్యవహారంపై ఎట్టకేలకు మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.నిషేధిత మాంజా అమ్మకాలు, వాటి వల్ల జరుగుతున్న ప్రమాదాలపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కమిషన్ దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీలోపు దీనిపై తీసుకున్న చర్యలతో కూడిన సమగ్ర నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
నగరంలో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, దీని వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని అడ్వకేట్ రామారావు ఇమ్మానేని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. నిషేధం కేవలం కాగితాలకే పరిమితమైందని, గ్రౌండ్ లెవల్లో దీని అమలు శూన్యమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని సుమోటోగా కాకుండా, సీరియస్ కేసుగా పరిగణించిన కమిషన్, సాక్షాత్తూ నగర పోలీస్ బాస్కే నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కమిషన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 26లోపు సీపీ ఎలాంటి నివేదిక ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.