08-06-2025 12:09:51 AM
రాజేంద్రనగర్, జూన్ 7: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. తమపై తప్పుడు కథనాలు మీడియాలో ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఇటీవల రాజేంద్రనగర్ పోలీసులకు క్రిశాంక్ఫై కాంగ్రెస్ నేత అయిన ఫయీమ్ ఖురేషి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఈ మేరకు శనివారం పోలీసుల ఎదుకు విచారణకు క్రిశాంక్ హాజరయ్యారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకొని ఇంగ్లాండ్ వెళ్లిన మిస్ ఇంగ్లాండ్.. తమను వేశ్యల మాదిరిగా చూస్తున్నారని ఆరోపిస్తూ ఓ అంతర్జాతీయ పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చారని తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పత్రికలు, టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయని, అదే విషయాన్ని తాము ట్వీట్ చేశామని స్పష్టం చేశారు.
జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేయకుండా తమపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీదారులతో కొందరు కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్ అయిన ఫైన్ ఖురేషికి ప్రస్తుతం వేలకోట్లు ఎలా వచ్చాయని మన్నే క్రిశాంక్ ప్రశ్నించారు. రాజేంద్రనగర్ పోలీసులు డబల్ మర్డర్ కేసు విచారణ వదిలేసి అప్రధాన్య కేసుపై దృష్టి సారిస్తున్నారని ఎద్దేవా చేశారు.