09-06-2025 12:22:42 AM
హనుమకొండ, జూన్ 8 (విజయ క్రాంతి): బి.ఆర్. భగవాన్ దాస్ జయంతి సందర్భంగా హనుమకొండలోని అశోక జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వారి కుటుంబ సభ్యులు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గొప్ప కమ్యూనిస్టు నాయకుడు, ట్రేడ్ యూనియన్ ఉద్యమ కారుడు బి.ఆర్. భగవాన్ దాస్ జయంతిని జరుపుకుంటున్నమని తెలియజేశారు.
భగవాన్ దాస్ స్వతహాగా ప్రజల సమస్యల పట్ల గాఢమైన చైతన్యం కలిగిన నాయకులు. ఆయన ఉద్యమ జీవితం ఒక ప్రజాస్వామ్యపరమైన ఆశయం కోసం సాగిన నడక. వత్తులు, ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగాల కార్మికులకు మద్దతుగా పోరాటాలు చేసిన విధానం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.
ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో తలమానికంగా నిలిచారని, కార్మికుల కనీస వేతనాలు, భద్రతా నిబంధనలు, సేవా హక్కుల కోసం చేసిన పోరాటాలు అనేక కార్మికుల జీవన ప్రమాణాలను మార్చాయని తెలిపారు. ఉద్యమాల్లో ప్రజల సమస్యల పట్ల స్పష్టత ఉండేదని. కమ్యూనిజం యొక్క నిజమైన అర్థాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిరంతర కృషి చేశారు.
భూమి పేదలదే, కార్మికుడే రాజు అనే నినాదాలను ప్రాక్టికల్ గా చూపించిన నాయకుడు భగవాన్ దాస్, కుమారుడు బి.ఆర్. లెనిన్ కూడా పితామహుని మార్గంలో కొనసాగుతున్నారు. వామపక్ష ఆలోచనలతో జర్నలిజంలో, ప్రజాసేవలో చురుకుగా ఉన్నారన్నారు.ఆ సేవల దిశగా మనం ముందుకు సాగడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, యువజన నాయకులు తోట పవన్, భగవాన్ దాస్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.