కిటకిటలాడిన మహాశక్తి ఆలయం
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్ దంపతులు
కరీంనగర్, మార్చి 27 (విజయక్రాంతి): నగరంలోని మహిమాన్విత మహాశక్తి ఆలయం శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా భక్తుల తాకిడితో కిటకిటలాడింది. ఆలయంలో సీతారాముల కళ్యాణం భద్రాద్రి తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్-అపర్ణ దంపతులు, కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.
వేద మంత్రోచ్చారణాల మధ్య అట్టహాసంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు జరిగాయి. యజ్ఞోపవీతం మొదలు కన్యదానం, జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు వరకు సీతమ్మ-రామయ్య పెళ్లి వేడుకలను వేద పండితులు భక్తులకు వివరించారు. రామయ్య పెళ్లి వేడుకలకు వేలాదిగా భక్త జన సందోహం తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు చల్లని మంచి నీళ్లు, మజ్జిగను సరఫరా చేశారు. ఎండ నుండి ఉపశమనం కలిగించేందుకు కూలర్లు ఏర్పాటు చేశారు. 25 వేల మంది భక్తులకు భోజనాలు, ప్రసాదాలు వితరణ చేశారు.




