calender_icon.png 5 December, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలి

05-12-2025 12:13:39 AM

మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతుల్లో కలెక్టర్, కీలక సూచనలు చేసిన జనరల్ అబ్జర్వర్ 

నిజామాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి: ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. kపోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్ లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

అయితే పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైకో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. 

సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా, ఇతరులెవరిని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.

కరదీపిక లోని అంశాలను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకుని తదనుగుణంగా విధులు నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ అంకిత్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సునీల్, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.