27-10-2025 10:28:25 PM
కలెక్టర్ బాదావత్ సంతోష్..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల పంటలు నష్టపోకుండా పత్తి, మొక్కజొన్న, వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
హైదరాబాద్ సెక్రటేరియట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొని, జిల్లాలో కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాలో వరి 236, మొక్కజొన్న 15, పత్తి 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రెండు పత్తి కేంద్రాల ద్వారా 1,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగిందన్నారు. వర్షాల ప్రభావం లేకుండా పంటలు సురక్షితంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.