calender_icon.png 25 July, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చేసిందేమీ లేదు

24-07-2025 12:37:33 AM

- మా శిలాఫలకం తొలిగించడం ఎంతవరకు న్యాయం

- ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి నిజం కాదా?

- ఆసుపత్రి సందర్శనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధ్వజం

లక్షెట్టిపేట, జూలై 23 : పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నిర్మాణానికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మండిపడ్డారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో 30 పడకల సామాజిక ఆసుపత్రికి బీజం పడిన మాట నిజం కదా? అని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకుని అసెంబ్లీ సాధారణ ఎన్నికల అనంతరం ప్రారంభమైనంత మాత్రాన కర్త, కర్మ, క్రియ నేనే అని చెప్పుకోవడం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకే దక్కిందని ఏద్దేవా చేశారు. 

గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు లక్షెట్టిపేట వైపు కనీసం కన్నెత్తి చూడని ప్రేమ్‌సాగర్ రావుకు ఈ ఆసుపత్రి నిర్మాణంలో తన పాత్ర ఏమి లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నొక్కి చెప్పారు. 2013 లో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాను రాసిన లెటర్ ద్వారా ఈ ఆసుపత్రి నూతన భవనం మంజూరైనట్లు చెప్పుకోవడం ప్రేమ్ సాగర్ రావు మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా రూ. 8 కోట్లపై చిలుకు నిధులతో నిర్మిస్తే ఇప్పుడు చివరి దశలో ఓపెనింగ్ చేసి సొమ్ముకరిది సొకొకరిదనే ప్రవర్తన ప్రేమ్ సాగర్ రావులో కనిపిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జిల్లా అధికారులు కూడా మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఆసుపత్రి శిలాఫలకంను ఏ నిబంధనల మేరకు తొలగించారో తెలపాలని, వెంటనే మా శిలాఫలకంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు హద్దులు దాటితే చూస్తూ ఊరుకోమన్నారు. నిజంగా ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ను ఎందుకు ప్రారంభించడం లేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

వ్యాపారాలు చేసుకునే వారికి ప్రారంభోత్సవం అయితే దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు గాని వ్యాపారులు ఇక్కడికి రావడం లేదని కుంటి సాకులతో తప్పించుకోవడం కాంగ్రెస్ నాయకులు వ్యాపారులను మోసం చేయడమేనన్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి లేదని కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వింతగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు  శ్రీనివాస్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.