31 May, 2026 | 1:07 AM

పార్టీని మరింత బలోపేతం చేయాలి

31-05-2026 12:34 AM
  1. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి అప్రమత్తంగా ఉండాలి
  2. మీనాక్షి నటరాజన్‌తో జగ్గారెడ్డి భేటీ 

హైదరాబాద్ మే 30 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చర్చించారు.

రాబోయే 6 నెలల నుంచి ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమని మీనాక్షి నటరాజన్‌కు జగ్గారెడ్డి వివరించారు. ఎన్నికల సంవత్సరం సమీపిస్తున్నందున ఇప్పటి నుంచే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం జగ్గారెడ్డి  మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఎలాంటి ఆధారం లేదన్నారు. నా భేటీపై అనవసర రాజకీయ అర్థాలు తీయవద్దనీ తెలిపారు.

జగ్గారెడ్డి కీలక సూచనలు 

కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక సూచనలు చేశారు. రెండోసారి గెలిస్తేనే రాజకీయాల్లో నిలబడతారంటూ హితబోధ చేశారు. శనివారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తారసపడ్డారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కీలక సూచనలు చేశారు.