14-09-2025 12:23:57 AM
ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్
ఖమ్మం, సెప్టెంబర్- 13 (విజయక్రాంతి): రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి రాజగోపాల్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి మాట్లాడుతూ..
లోక్ అదాలత్లో రాజీతో ఇరువర్గాలు గెలిచినట్లేనని, లోక్ అదాలత్ తీర్పు, సుప్రీంకోర్ట్ తుది తీర్పుతో సమానమని అన్నారు. కేసులు రాజీ చేసుకోవడం ద్వారా అప్పీలు చేసుకోవడం ఉండదని, కోర్టు చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృధా అవుతుందని చెప్పారు. జిల్లాలో 4,746 కేసులను గుర్తించి, ఇప్పటికే 502 కేసులు పరిష్కరించగా, గత లోక్ అదాలత్ లో 19849 కేసులను పరిష్కరించినట్లు ప్రధాన నాయమూర్తి తెలిపారు.
ప్రస్తుత లోక్ అదాలత్ లో 597 కేసుల పరిష్కారం అవనున్నట్లు అన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, భవిష్యత్తులో న్యాయ సేవాధికార సంస్థ సేవలు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో తీసుకెళ్లడానికి బార్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాల త్లో మోటార్ వాహన కేసుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ప్రమాద మరణానికి 19.50 లక్షల సెటిల్మెంట్కు సంబం ధించి, పెద్దబోయిన మాధవి, పెద్దబోయిన లక్ష్మణ్ ల ఫ్యామిలీ కేసుకు సంబంధించి పరిష్కారం చేసి,
అవార్డు తోపాటు పూల మొక్క లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బహుకరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు దేవినేని రాంప్రసాదరావు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖరరావు, ఎం. కల్పన, టి. మురళీమోహన్, కాసరగడ్డ దీప, బెక్కం రజని, ఏపూరి బిందు ప్రియ, వినుకొండ మాధవి, బి. నాగలక్ష్మి, అఖిల పాల్గొన్నారు.