28-06-2025 01:25:43 AM
ట్యాపింగ్పై సుదీర్ఘంగా సిట్ విచారణ
-నెలలు గడుస్తున్నా కొలిక్కిరాని కేసు
-ప్రభాకర్రావు వ్యవహారమంతా కాలయాపనకే..
-రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారని బీజేపీ నేతల ఆరోపణ
-పెద్ద తలలను అరెస్టు చేయాలని డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాం తి): రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఓ అంతులేని డైలీ సీరియల్ను తలపిస్తోంది. విచారణ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడుస్తున్నా కేసు కొలిక్కి రాకపోవడం, కీలక అరెస్టులు జరగకపోవడంపై రాజకీయవర్గాల్లో, ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు అధికారికంగా 2024 మార్చిలో వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) కార్యాలయంలో కీలకమైన ఆధారాలను ధ్వంసం చేశారంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదుకావడంతో దర్యాప్తు ప్రక్రియ మొదలైంది. సుమారు 650 మంది బాధితులను గుర్తించగా, వారిలో అత్యధికులు రాజకీయ నాయకులే. ఇప్పటివరకు 250 మంది కి పైగా ప్రముఖులు, సాక్షులు, అనుమానితులకు నోటీసులు జారీచేసి వారి వాంగ్మూలాలను నమోదు చేశా రు.
వీరిలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బండి సంజయ్తో పాటు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. కేసులో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలతో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న వంటి కొందరు అధికారులను అరెస్టు చేసినప్పటికీ, వారంతా బెయిల్పై బయటకు వచ్చారు. సిట్ దర్యాప్తు వేగంగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నా, అది కేవలం నామమాత్రమేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
‘షార్క్ చేపలను వదిలేసి, చిన్న చిన్న బుడ్డపర్కలను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చివరికి ‘గాడిద గుడ్డు’గా తేలుతుంది’ అంటూ బీజేపీ నేత రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు అద్దం పడుతున్నాయి. కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును గంటల తరబడి విచారించినా, కనీసం అరెస్టు చేయకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు నుంచి అరెస్టు కాకుండా రక్షణ పొందడం, దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పడం వంటివి కేవలం కాలయాపన వ్యూహంలో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ అనే తీవ్రమైన నేరంపై దర్యాప్తును ప్రభుత్వం ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందా? అనే సందేహాలు బలపడుతున్నాయి. ఓ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ విచారణను వాడుకుంటున్నారు తప్పా నిజంగా దోషులను శిక్షించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. దమ్ముంటే అసలైన నిందితులకు నోటీసులు ఇవ్వండి, ట్యాపింగ్కు ఆదేశాలిచ్చిన అసలు పెద్ద తలలను అరెస్టు చేయండి అని విపక్షాలు చేస్తున్న సవాళ్లకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం కరువైంది.
బీఆర్ఎస్కు తలనొప్పిగా.. సొంత నేతల వాంగ్మూలం
ఈ కేసులో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన అంశం.. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షనేతలనే కాదు, సొంత పార్టీలోని కీలక నాయకులను సైతం వదల్లేదని తెలుస్తోంది. పద్మాదేవేందర్రెడ్డి, రాజయ్య వంటి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అగ్రనేత హరీశ్రావు ఫోన్ సైతం ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో బీఆర్ఎస్లో ఉండి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఈటల తదితర నేతలు ట్యాపింగ్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ చేయమన్న పెద్దలు ఎవరో ప్రభాకర్రావు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్న నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం బయటకు రావడంతో..సిట్ ముందు వీరేం చెబుతారు అనే ఆసక్తి నెలకొంది. పార్టీని కాపాడుకునేందుకు వీరు నిజాలను దాచిపెట్టి, నామమాత్రపు వాంగ్మూలాలతో సరిపెడుతారా? ఎవరి పేరు చెబుతారు? అనేది ఉత్కంఠ రేపుతోంది.