విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్, అన్మెన్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫరూఖీని కోరారు. ఈ సందర్భంగా సోమవారం మింట్ కాంపౌండ్ లోని కార్యాలయంలో సీఎండీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఆర్జిజన్ కార్మికులు అందరిని విద్యార్హత ఆధారంగా జేఎల్ఎం, జేపీఏ, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, సబ్ ఇంజినీర్ తదితర రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని కోరారు.
అన్మ్యాన్ వ్యవస్థను రద్దు చేసి ఆ కార్మికులను సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం చేయాలన్నారు. ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గృహజ్యోతి పథకం కారణంగా ఉపాధి కోల్పోయిన బిల్ కలెక్టర్స్కు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం ఇవ్వాలన్నా రు. 2023 జూలై 1 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకూ రావాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని, లేదంటే భవిష్యత్తులో విద్యుత్ కార్మికులంతా ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు.






