20-12-2025 12:51:29 AM
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి) : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు వెలువరించేందుకు మరో పక్షం రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ( ఈ నెల 19) వరకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది.
సుప్రీంకోర్టు విధించిన గడువుకు రెండు రోజుల ముందే (బుధవారం) ఐదుగురు ఎమ్మెల్యేలపై (బండ్ల కృష్ణమోహన్రెడ్డి, తెల్లం వెంకట్రావ్, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికపూడి గాంధీ ) ఉన్న అనర్హత పిటిషన్ స్పీకర్ ప్రసాద్కుమార్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. అయితే మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలలో పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్కుమార్ అనర్హత పిటిషన్లపైన గురువారమే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగినా.. స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది. వీరిపై ఈ నెలాఖరు లేదంటే జనవరి మొదటి వారంలో స్పీకర్ తీర్పు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు వివరణ ఇచ్చేందుకు స్పీకర్ను గడువు కోరారు. ఇక దానం నాగేందర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. దానం నాగేందర్ గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు దానం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠగా మారింది.