29-09-2025 04:23:03 PM
వనదుర్గమ్మకు హోరెత్తిన బోనాల జోరు
చదువుల వరదాయినిగా వనదుర్గమ్మ దర్శనం
హాజరైన ఎమ్మెల్యే సతీమణి శివాని, వందలాదిమంది మహిళలు, భక్తులు
పాపన్నపేట (విజయక్రాంతి): దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల్లో కొలువుదీరిన వనదుర్గమ్మ చెంత సోమవారం బోనాల జోరు హోరెత్తింది. వనదుర్గమ్మ ఆలయం చెంత ఉన్న గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన సోమవారం వనదుర్గమ్మను చదువుల వరదాయిని సరస్వతి దేవి రూపం, తెలుపు రంగు చీర, వీణ, హంసలతో సుందరంగా అలంకరించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు.
బోనాల ఊరేగింపుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోహిత్ శతీమని శివాని హాజరై గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనాలను డప్పు చప్పుళ్లు.. మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి వనదుర్గమ్మకు సమర్పించారు. భక్తుల జయజయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం హోరెత్తింది. వన దుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు వేడుకున్నారు.
వనదుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి: శివాని
వనదుర్గమ్మ తల్లి చల్లని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు శివాని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేడు మహాగౌరి దేవిగా వనదుర్గమ్మ దర్శనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన మంగళవారం అష్టమిని పురస్కరించుకొని వనదుర్గమ్మను మహాగౌరి (దుర్గాదేవి) రూపం, ఎరుపు రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.