27-05-2025 12:16:24 AM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శిక్షణా కార్యక్రమం
సంగారెడ్డి, మే 26(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నూతన చట్టం భూభారతిలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనీ జిల్లా మహిళా సమైక్య భవన్లో లైసెన్సు సర్వేర్లు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ వ్యక్తికి ఆధార్ లాగా భూమికి భూదార్ ఉందని, భూమిలోని ప్రతి కమతానికి మ్యాప్ కీలకం కావడంతో సర్వేయర్లు చాలా అవసరం అన్నారు.
క్షేత్రస్థాయిలో సర్వేయర్ పని కీలకమని, భూమి క్రయ విక్రయాల్లో భూ బదలాయింపుల్లో, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, సరిహద్దుల నిర్ణయంలో, మ్యాపుల తయారీలో, సర్వేయర్లు కీలక భూమిక అన్నారు. జిల్లావ్యాప్తంగా 298 మంది లైసెన్సు సర్వేర్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 166 మందిని మొదటి దశలో శిక్షణ కార్యక్రమం అందిస్తున్నామన్నారు.
మిగతా 132 మందిని రెండవ దశలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సర్వేయర్లు ఈ 50 రోజుల శిక్షణ కార్యక్రమంలో సాంప్రదాయ, నూతన, టెక్నాలజీ సర్వేలను నేర్చుకోవాలన్నారు. అనంతరం శిక్షణ పొందుతున్న సర్వేయర్లకు స్టేషనరీ ఫైళ్ళను అందించారు. ఈ కార్యక్రమంలో ఎడి సర్వే ల్యాండ్ రికార్డు ఐనేష్, సంబంధిత అధికారులు, లైసెన్స్ సర్వేయర్లు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో 116 మంది...
మెదక్ జిల్లా కేంద్రంలో స్థానిక ఐటిఐ కళాశాల ఆవరణలో ఆరట్స్ క్యాంపస్ లో రెండు నెలల సర్వేయర్లకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం అదనపు కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. జిల్లా నుండి మొదటి విడతలో మొత్తం 116 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమం జూలై 26వ తేదీన ముగుస్తుందని తెలిపారు. శిక్షణలో అవగాహన పొందిన ప్రతి అంశాన్ని బాధ్యతగా ప్రభుత్వపరంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భూ కొలతల సహాయ సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్స్, తదితరులుపాల్గొన్నారు.