20-12-2025 12:42:16 AM
ముషీరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ కార్పోరేషన్ గా ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో లష్కర్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని చేపట్టిన దీక్షలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు మున్సిపాలిటీ లుగా ఉండేవని, కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, నగరం విస్తరించడంతో 100 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్గా ఏర్పడిందని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో 150 డివిజన్లుగా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ ఆర్ లోపల ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ లు, మున్సిపాలిటీలను విలీనం చేసి 300 డివిజన్ లు చేసిందని చెప్పారు. కార్పోరేషన్ ఏర్పాటు కోసం చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బన్సీలాల్ పేట డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత, నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ రావు, ఎడ్ల హరి బాబు యాదవ్, నరేందర్ నాయి, ముఠా జయసింహ, ఏసూరి మహేష్, సమితి ప్రధాన కార్యదర్శి సాదం బాలరాజ్ యాద వ్, బాబురావు, శైలేందర్, హైదరాబాద్ నగర అంబులెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు ఉన్నారు.