09-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్, జనవరి 8 (విజయ్క్రాంతి) : ఎంతో చరిత్ర కలిగిన సికింద్రా బాద్ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన పద్మారావు నగర్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు.
సికింద్రాబాద్ను కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ఈ నెల 11న బాలం రాయ్లోని లీ ప్యాలెస్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార కార్మిక సంఘాలు, పలు కాలనీలు, బస్తీల కమిటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశం ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజి రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీ, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అంబులెన్స్ సురేష్, ఏసూరి మహేష్, బాబురావు, మహేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.