గడువులోగా ‘ఎస్ఐఆర్’ పూర్తి చేయాలి
కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్, జులై 10 (విజయక్రాంతి): పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ, నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఎస్ఐఆర్ లో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ క్షేత్రస్థాయిలో సర్ నిర్వహణపై ఆర్డీవోలకు తాసిల్దారులకు గూగుల్ మీరు ద్వారా ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను జిల్లాలో పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ వివరాల, నమోదు ఇప్పటివరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఎంత శాతం పూర్తయ్యింది, ఓటర్లు అందరికీ ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ పూర్తయిందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో లేని ఓటర్లకు కూడా సమాచారం అందించాలని, గడువు లోపు వారు తమ ఎన్యూమరేషన్ ఫారంలు తిరిగి అందించేలా చూడాలన్నారు.
జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఎన్యూమరేషన్ ఫారంలను జాగ్రత్తగా పరిశీలించాలని, వివరాలు సరి చూసుకున్న మీదట వారి కుటుంబ సభ్యుడి సంతకంతో తీసుకోవచ్చని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ ను ఏకకాలంలో సమాంతరంగా నిర్వహించాలని అన్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో పొందుపర్చిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా నిర్ధారణ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.. ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఓటరు మ్యాపింగ్ విషయంలో సహకారం అందించాలని సూచించారు.
ప్రతి బీఎల్ఓ దగ్గర ఓటరు జాబితా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డబుల్ ఓట్లు కలిగిన వారిని గుర్తిస్తూ, ఓటరు జాబితాలో మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా, సకాలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు బీఎల్ఓ లకు తగిన సహకారం అందించాలని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి, ఎన్నికల సూపరిండెంట్ గఫార్, ఆర్డీవోలు, తాసిల్దారులు ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు ఉన్నారు.






