18-12-2025 12:40:54 AM
పటిష్టమైన బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 17, (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, నిబంధనల మేరకు జిల్లాలో నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో విజయ వంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగా చేపట్టిన విస్తృత ఏర్పాట్లు, భద్రతా చర్యల కారణంగా పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు.
ఈ మూడో విడత ఎన్నికలలో భాగంగా జిల్లాలోని ఆల్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతానగర్, టేకులపల్లి, ఇల్లందు మండలాలలో పోలింగ్ నిర్వహించబడింది. జిల్లాలో మొత్తం 1,75,074 మంది ఓటర్లు నమోదు కాగా, పోలింగ్ ముగిసే సమయానికి 1,48,230 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 84.67 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
పోలింగ్ ప్రారంభమైన ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు హాజరయ్యారు. ఉదయం 9.00 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 37,231 ఓట్లు పోలవగా ఇది 21.27 శాతం పోలింగ్గా నమోదైందని, ఉదయం 11.00 గంటల వరకు 1,09,155 ఓట్లు పోలై 62.35 శాతం పోలింగ్ నమోదైంది .మధ్యాహ్నం 1.00 గంటల వరకు మొత్తం 1,41,176 ఓట్లు పోలై 80.64 శాతం పోలింగ్ నమోదు కాగా, క్లోజ్ ఆఫ్ పోలింగ్ సమయానికి మొత్తం 1,48,230 ఓట్లు పోలై 84.67 శాతం పోలింగ్తో ఎన్నికలు ముగిశాయని కలెక్టర్ వివరించారు.
మండలాల వారీగా పోలింగ్ శాతం పరిశీలిస్తే ఆల్లపల్లి మండలంలో 88.09 శాతం, గుండాల మండలంలో 86.25 శాతం, జూలూరుపాడు మండలంలో 88.71 శాతం, లక్ష్మీదేవిపల్లి మండలంలో 80.86 శాతం, సుజాతానగర్ మండలంలో 89.32 శాతం, టేకులపల్లి మండలంలో 86.47 శాతం, ఇల్లందు మండలంలో 80.65 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సామగ్రి , బ్యాలెట్ పేపర్లను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్యగా సంబంధిత కౌంటింగ్ కేంద్రాలకు తరలించామని, కౌంటింగ్ ప్రక్రియ పోలీసు శాఖ, ఎన్నికల అధికారుల సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు మధ్య కొనసాగించారు.
కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఉపయోగించిన ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, సంబంధిత రికార్డులు అన్నింటినీ నిబంధనల ప్రకారం సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్కు తరలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.