18-06-2025 10:57:18 PM
ప్రజలు వైషమ్యాలు పెట్టుకోవద్దు..
హుస్నాబాద్ ఏసీపీ సదానందం..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) అక్కన్నపేటలో బుధవారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం(ACP Sadanandam), సీఐ శ్రీనివాస్, ఎస్ఐ విజయ్ భాస్కర్ తో కలిసి ప్రజలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎన్నికలను అడ్డం పెట్టుకొని గొడవలకు దిగవద్దన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భద్రతకు సీసీ కెమెరాలు, యువతకు మార్గదర్శనం
గ్రామ ప్రజల రక్షణకు సీసీ కెమెరాలు అత్యంత ముఖ్యమని ఏసీపీ సదానందం ఉద్ఘాటించారు. 24 గంటలు పనిచేసే వీటి ఏర్పాటుకు గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో, ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. ఏదైనా వ్యసనాలకు లోనైనట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారికి కౌన్సెలింగ్ అందిస్తామని తెలిపారు. గుడుంబా, నాటు సారా తయారు చేయవద్దని హెచ్చరించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఏసీపీ సదానందం కోరారు. బ్యాంకు వివరాలు, వ్యక్తిగత డేటాను ఎవరికీ ఫోన్లో పంచుకోవద్దని సూచించారు. ఏదైనా మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ సెల్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని తెలిపారు. గ్రామంలో ఎవరూ కూడా బెల్ట్ షాపులు నడపవద్దని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, వారి ధన, మాన, ప్రాణ రక్షణకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.