23-05-2025 05:04:15 PM
సారంగపల్లిలో ఘటన
మందమర్రి,(విజయక్రాంతి): ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి రూ.3000 చోరీ చేసిన ఘటన మండలంలోని సారంగపెల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు బచ్చలి సువర్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముండే నిరుపేద కుటుంబానికి చెందిన బాధితురాలు భర్త గతంలోనే అనారోగ్యంతో మృతి చెందగా కూలి పనులు చేస్తూ తన కుమారుడు, తల్లితో కలిసి నివాసముంటు కుటుంబాన్ని పోశించుకుంటుంది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండ టంతో గురువారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్ళింది.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి బీరువాలోని దుస్తులు చిందర వందర చేసి బీరువాలో దాచిన రూ.3000 ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం బాధితురాలు తన ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లోని బీరువా పగుల గొట్టి ఉండటం దుస్తులు చిందర వందరగా ఉండటం, అందులో కూలి పనులు చేసి దాచిన రూ.3000 నగదు కనిపించక పోవడంతో చోరీ జరిగిందని బాధితురాలు రోదించిన తీరు పలువురిని తీవ్రంగా కలిచివేసింది. చోరీ సమాచారం తెలుసుకున్న చుట్టు ప్రక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరుస చోరీలతో భయాందోళనలో గ్రామస్థులు...
గ్రామంలో గడిచిన పక్షం రోజులుగా చోరీలు జరుగు తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవు తున్నారు.గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత వారం రోజుల క్రితం చోరీకి విఫలయత్నం చేయగా గ్రామస్థులు గమనించి కేకలు వేయడంతో పారిపోయి నట్టు పలువురు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో దొంగలు చోరీలకు విఫల యత్నం చేస్తుండటం పట్ల గ్రామస్థులు తీవ్ర భయాందోళ నలకు గురవుతున్నారు.
అంతే కాకుండా గ్రామం లోని వ్యవసాయ బోరు మోటార్లు దొంగలు ఎత్తుకు పోవడంతో మోటార్లకు రక్షణ లేకుండా పోయిందని, తాజాగా గ్రామంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలు చోటు చేదుకుంటుండంతో గ్రామస్థులు రాత్రి పూట నిద్ర మాని గస్తీ నిర్వహించాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు.ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి నిఘా పెంచి దొంగతనాలను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.