భూముల సర్వేలో పొరపాట్లకు తావుండొద్దు
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురం భూముల సర్వేలో ఏర్పాటు చేసే జియో కోఆర్డినేషన్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ శివారులోని రాజేశ్వరరావు పల్లె లో జరుగుతున్న సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్వే నిర్వహిస్తున్న తీరును, డేటా ఎంట్రీ, జియో కోఆర్డినేషన్ ఏర్పాటు పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామచంద్రపురం భూముల సర్వే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతో నిర్వహిస్తుందని, జియో కోఆర్డినేషన్ ఏర్పాటు, సర్వే నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, తహసిల్దార్ విజయభాస్కర్ సంబధిత అధికారులు పాల్గొన్నారు.




