01-06-2025 12:00:00 AM
భోపాల్, మే 31: భారత నారీశక్తికి సవాల్ విసిరి పాకిస్థాన్ ఉగ్రవాదులు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని భోపాల్లో శనివారం ఏర్పాటు చేసిన ‘మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్’లో ప్రసంగించారు.
‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత కుమార్తెల బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది. పహల్గాం దాడితో కేవలం నరమేధం మాత్రమే కాకుండా మన సంస్కృతి మీద దాడి చేసేందుకు కూడా ఉగ్రవాదులు ప్రయత్నించారు.
వారు మన సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారి పాలి ట, వారిని పోషిస్తున్న వారి పాలిట పెను శాపంగా మారింది. ఆపరేషన్ సిందూర్ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయం.’ అని పేర్కొన్నారు.
బీఎస్ఎఫ్ మహిళా బృందాన్ని ఆకాశానికెత్తిన ప్రధాని
బీఎస్ఎఫ్ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. ‘నేహ భండారి నేతృత్వంలోని బీఎస్ఎఫ్ మహిళా బృందం అద్భుతంగా విధులు నిర్వర్తించింది. భారత నారీశక్తిని ప్రపంచం మొత్తం వీక్షించింది.
మన బీఎస్ఎఫ్ నారీ జవాన్లు మన సరిహద్దులను రక్షిస్తూ.. దాడులు చేసే వారికి సరైన సమాధానం ఇస్తున్నారు.’ అని పేర్కొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) నుంచి తొలిసారిగా 17 మంది మహిళా క్యాడెట్లతో కూడిన బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకోవడం మహిళలకు శుభసూచకం అన్నారు.