03-11-2025 01:32:44 AM
రామచంద్రపురం, నవంబర్ 2 :రామచంద్రపురం పట్టణ పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు ఇటీవల విద్యుత్ తీగలకు ఆటంకం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను నరికించారు. అయితే నరికిన చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతో పట్టణంలో అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ప్రజలకు, వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆటం కాలు రాకుండా ముందస్తు చర్యగా చెట్లను నరికడం ఆనవాయితీ అయినప్పటికీ నరికిన చెట్లను అలాగే వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. రహదారుల పక్కన, షాపుల ముందు పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు పేరుకుపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.
వర్షం పడినప్పుడు ఈ వ్యర్ధం తడి చెత్తగా మారి దుర్వాసనతో పాటు దోమల పెరుగుదలకు దారితీస్తోంది. రహదారులపై పేరుకుపోయిన కొమ్మలు ట్రాఫిక్కు కూడా అడ్డంకిగా మారాయి. పలు ప్రాంతాల్లో రోడ్డుపై చెట్ల కొమ్మలు పడిపోవడంతో వాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి చెత్తను, చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.