03-11-2025 01:31:20 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నిజాంపేట(మెదక్), నవంబర్ 2 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పిం చాలని ఆదేశించారు వరి ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని సూచించారు. రైతులు పంట తెచ్చిన రోజు రిజిస్టర్లలో ఏ రోజు తెచ్చా రు, తెచ్చినప్పుడు ఎంత తేమశాతం ఉంది అనే వివరాలను నమోదు చేసుకుని, సీరియల్ నెంబర్ల వారీగా కొనుగోలు చేసి పంపించాలన్నారు.
బరువు కొల్చే యంత్రాలు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచుకొని ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలన్నారు. రైతు లు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రా ల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.