20-11-2025 12:33:59 AM
-అవినీతి పరుల పేర్లను బయటపెట్టిన కల్వకుంట్ల కవిత
-నోరు మెదుపని అవినీతి తిమింగలాలు
-పాత ప్రాజెక్టులకు బొక్కలు పెట్టి పేరు మార్చుకోవడం సిగ్గుచేటు
-జిఓ లు సరే మరి నిధులు ఎందుకు కేటాయించలేదు
-వనపర్తిలో రెండేళ్ల అభివృద్ధి పనులపై శ్వేతా పత్రంకు మేము సిద్ధం
-పదేళ్ల మీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రంతో చర్చకు రండి
-బహిరంగ సవాలు విసిరిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, నవంబర్ 19 ( విజయక్రాంతి ): బిఆర్ఎస్ పార్టీలో పెద్దపెద్ద అవినీతి తిమింగలాలు ఉన్నాయని స్వయాన కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేర్లు బయటపెట్టిన ఇప్పటివరకు తేలు కుట్టిన దొంగల్లాగా ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదని అలాంటి అవినీతి తిమింగలాలు నేడు ప్రజల మధ్యన నీతులు వల్లించడం సిగ్గుచేటని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఉక్కు మహిళ, భారత దేశపు తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని ఆమె జయంతి సందర్భంగా మనందరం ఇందిరా గాంధీ ఆశయ సాధనాల కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు నేడు కొందరు నాయకులు అక్కడక్కడ బొక్కలు పెట్టి తామే సాగునీరు అందించామని గొప్పలు చెప్పుకుంటూ వారి పేర్లను మార్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు సముచిత స్థానం కల్పించి గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాకవి గద్దర్, అందెశ్రీ లాంటి మహానుభావులకు ప్రభుత్వపరమైన గౌరవ మర్యాదలను అందిస్తూ వారి కీర్తిని నలు దిక్కుల చాటినా ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో కళాకారులను కష్టాలకు గురిచేసి కేవలం ఆట బొమ్మలుగా మార్చారని ఆయన అన్నారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి నిర్మించి ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ దేనిని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కంటోన్మెంట్ ఎన్నికలైన జూబ్లీహిల్స్ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బుల్డోజర్ పాలన జరుగుతుందని ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని మొన్నటి ఎన్నికలు నిరూపించాయనీ ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తుందని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, మహిళల ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు, సన్న బియ్యం , రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, విద్యార్థులకు 42 శాతం మెస్ చార్జీలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం లాంటి అనేక పథకాలు చేపట్టి నిరుపేదలకు అండదండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు ఈ నియోజకవర్గానికి పెద్ద జీతగాడిలా పనిచేస్తారని చెప్పానని నేటికీ అదే తరహాలో పనిచేస్తున్నానని ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్న తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని ఏదైనా బంధు ప్రీతితో వేరే వాళ్లకు అవకాశం కలిపిస్తే వారు అభివృద్ధికి ఆటంకాలుగా మారుతారే తప్ప వారి వల్ల జరిగేదేమీ ఉండదని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పథకాల అమలులో అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదుని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి రామకృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ య్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.