20-11-2025 12:35:11 AM
వివిధ క్రీడలలో బంగారు, రజత పతకాలు కైవసం
పటాన్ చెరు, నవంబర్ 19 :గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సంస్థకు కీర్తిని తెచ్చి పెడుతున్నారు. ఆయా ఈవెంట్లలో పతకాలను గెలుచుకుని ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చెన్నైలోని జేఎన్ఎల్ఎస్ లో జరిగిన ది చీఫ్ మినిస్టర్స్ ట్రోఫీ గేమ్స్ రాష్ట్ర స్థాయి పోటీలలో సీఎస్ఈ తొలి ఏడాది విద్యార్థి మందలపు శ్రీశాంత్ స్ట్రీట్ ఫైటర్ 6లో రజత పతకాన్ని సాధించారు.
మరో అద్భుతమైన విజయంలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి రుషికేశ్ మార్కా, హైదరాబాదులోని హైటెక్ సిటీలో నిర్వహించిన వీవైబీ యాక్టివ్ సీనియర్ టోర్నమెంట్ 2025-26లో (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అదే టోర్నమెంటులో పురుషుల డబుల్స్ లో బీబీఏ (ఎఫ్ఎం) తొలి ఏడాది విద్యార్థి ఆయుష్ తో కలిసి రజత పతకాన్ని కూడా సాధించారు.
వీటిని అదనంగా, ఇటీవలే బీ.ఆర్క్. మొదటి సంవత్సరం విద్యార్థిని ఆశ్రిత రాజు దాట్ల, భారతీయ పికిల్ బాల్ జాతీయ పోటీలలో 18 ఏళ్ల బాలికల రాష్ట్ర జట్టు ఈవెంటులో బంగారు పతకాన్ని గెలుపొందిన విషయం విదితమే. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, డైరెక్టర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, క్రీడల విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి విజేతలను అభినందించడంతో పాటు వారి నిబద్ధత, కృషి, క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించారు.