02-02-2026 12:00:00 AM
పార్టీకి చెందిన ఇతరులు తప్పుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను గెలిపించాలని, పార్టీ నుంచి పోటీ చేయడానికి నామినేషన్లు వేసిన ఇతరులు ఈనెల 3 లోగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త పొన్నం ప్రభాకర్ పార్టీ క్యాడర్ కు సూచించారు.
మహబూబాబాద్, ఇల్లందు, కేసముద్రం, మరిపెడ మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళి నాయక్, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షులు ఉమా మురళి నాయక్, దేవి ప్రసన్నతో కలిసి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురాలని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నేతలు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు.
ఏకాభిప్రాయం లేని వార్డులపై ముఖాముఖి మాట్లాడి, సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్టు కేటాయించిందని అందరూ కలిసి పనిచేయాలని, పొత్తులో బాగంగా సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పని చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక సెలెక్ట్ ఎలెక్ట్ పద్ధతిలో జరుగుతోందని, మీ అభ్యర్థిని మీరే ఎంచుకోవాలి.. గెలిచేవారికి టికెట్ ఇస్తున్నామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశాలు ఇస్తూ సామాజిక న్యాయం చేస్తూ అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులకు పార్టీ బీఫామ్ అందజేశారు.