కాంగ్రెస్ పార్టీకి షాక్..! రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
భోపాల్: 2026 రాజ్యసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో, మధ్యప్రదేశ్ నుండి మూడు రాజ్యసభ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను పరిశీలన సమయంలో తిరస్కరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది బీజేపీ అభ్యర్థులకు మార్గాన్ని సుగమం చేసింది.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బరిలో ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో, ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. విజయం సాధించిన అభ్యర్థులు అనంతరం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్ పై రేపు విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.






