calender_icon.png 15 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలోకి పెద్దపులి వచ్చేసింది

14-12-2025 06:07:27 PM

గోదావరిఖనిలో గోదావరి నది వద్ద పెద్దపులి అడుగులను గుర్తించాం..

జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య..

గోదావరిఖని (విజయక్రాంతి): రెండు రోజులుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టు బొగ్గు గని పరిసరాల్లో సంచరించిన పెద్దపులి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి గోదావరి నది దాటిన పెద్దపులి మేడిపల్లి బొగ్గు గని పరిసరాల్లో తిరిగింది. సింగరేణి అధికారులకు అనుమానం వచ్చి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య ఫారెస్టు సిబ్బందితో చేరుకొని గోదావరి వద్ద ఇసుకలో పెద్దపులి అడుగులను గుర్తించారు. అవి పెద్దపులి అడుగులేనని శివయ్య నిర్ధారించారు. మేడిపల్లి చుట్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. పెద్దపులి సంచారంతో అటు సింగరేణి కార్మికులు, ఇటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య

పెద్దపులి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఓసిపి పరిసర ప్రాంతాల నుంచి శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరి నది దాటి మేడిపల్లి శివారులోకి ప్రవేశించిందని జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య తెలిపారు. పెద్దపులి ఎన్టీపీసీ, మేడిపల్లి,  లింగాపూర్ ప్రాంతాలలో సంచరిస్తుందని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఒక్కరుగా కాకుండా పదిమంది గుంపులుగా పోవాలని, రాత్రి సమయంలో తిరగవద్దని, ఉదయం 7 గంటల తర్వాతనే ప్రజలు బయటికి రావాలని సూచించారు.

పశువులను అటవీ ప్రాంతాలకు పంపించవద్దని, పెద్దపులికి ఎవరు కూడా హాని చేయొద్దని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు పెద్దపులికి సంబంధించిన ఎలాంటి వీడియోలు గాని ఫోటోలు గాని తమ వద్దకు రాలేదని, కొంతమంది పాత వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అటవీశాఖ అధికారులు ఫోటోలు పంపితేనే ప్రజలు నమ్మాలని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను, ఫోటోలను ప్రజలు నమ్మవద్దన్నారు.