10-04-2025 02:00:17 AM
కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు కట్టుదితమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. ఈ నెల 11 నుండి 13 వరకు కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఇతర అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3 రోజుల పాటూ దారి పొడవునా అవసరమైన చోట్ల లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ నెల 11 రాత్రి నుండి 13 ఉదయం వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని, సుమారు 45 వేల మంది హనుమాన్ దీక్ష స్వాములు మాల విరమణ చేస్తారని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలో 64 సిసి కెమెరాలు ఉండగా, అదనంగా 50 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అలాగే 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.
ఇందుకోసం ఒక వేదికను ఏర్పాటు చేసి 100 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా కొండపైకి వెళ్లేందుకు ఆర్టిసీ బస్సులను పెంచాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని, కోనేరు వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానం ఆచరించే వీలున్నందున ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులను, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కేశ ఖండనకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా కళ్యాణ కట్ట వద్ద ఎక్కువ మంది నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేయాలని సూచించారు. పబ్లిక్ టాయిలెట్సు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు షిఫ్టుల వారీగా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, డిఎస్పీ రఘుచందర్, కొండగట్టు ఆలయ ఈఓ శ్రీనివాసరావ్, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, కలెక్టరేట్ ఏఓ హకీం, మున్సిపల్ కమిషనర్ స్పందన, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.