18-01-2026 01:58:03 AM
ఆదివాసి గిరిజనుల జొన్న గటక.. సాంబారు
ఉట్నూర్, జనవరి 17(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దేవుడి మహా పూజలు, నైవేద్యాలు భిన్నంగా ఉంటాయి. నాగోబా జాతర అంటేనే గటక.. సాంబారు వంటకాలు ప్రత్యేకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో నివాసముండే మెస్రం వంశస్థులతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి నాగోబా మహా పూజలకు వచ్చిన మెస్రం వంశస్థులు మర్రి చెట్ల వద్ద బుధవారం నుంచి సేద తీరుతున్నారు. మర్రి చెట్ల వద్ద శుక్రవారం అర్ధరాత్రి తూమ్ పూజలు నిర్వహించారు.
శనివారం ఉదయం మెస్రం వంశీలలో 22 తెగలకు చెందిన మెస్రం వంశీయులు ఒకే చోట కలిసి జొన్న గటక, సాంబారు వంటలు తయారు చేశారు. మహిళలు ప్రత్యేకంగా జొన్న గటక, లడ్డూలను తయారు చేసి గటుక లడ్డూలతో పాటు సాంబార్ను ప్రతి కుటుంబానికి అందజేశారు. ఆదివాసుల ఆచారం ప్రకారంగా నాగోబా దేవుడి మహా పూజలకు వచ్చిన వారందరూ జొన్న గటక, సాంబార్ ను అందరికీ అందిస్తామని మహిళలు తెలిపారు. ఆదివారం నిర్వహించే నాగోబా మహా పూజలపై ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావుతో మెస్రం వంశస్థులు చర్చించారు.