నేడు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్ గ్రౌండ్స్ వేడుకలతో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో నేడు 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో పలు మార్గాల్లో తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
బేగంపేట్, సంగీత్, క్లాక్ టవర్, పట్నీ, పారడైజ్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అవసరాన్ని బట్టి పలు కూడళ్ల వద్ద వాహనాలను మళ్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రజలు వీలైనంత వరకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని, కార్యక్రమం జరిగే ప్రాంతాలకు వెళ్లే రహదారులపై భారీ వాహనాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
రహదారులపై అనధికారిక పార్కింగ్ను కఠినంగా నిషేధించినట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను టోయింగ్ చేసి చర్యలు తీసుకుంటామని పోలీస్లు హెచ్చరించారు. అత్యవసర సేవల వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమం ముగిసిన వెంటనే ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేయబడతాయని పేర్కొన్నారు.
ట్రాఫిక్ పరిస్థితులను సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని, ట్రాఫిక్ సంబంధిత సమాచారం లేదా సహాయం కోసం మల్కాజిగిరి ట్రాఫిక్ హెల్ప్లైన్ 8712662999 ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.






