calender_icon.png 12 February, 2026 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్‌లకు స్థానచలనం

12-02-2026 01:48:23 AM

  1. పదిమందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  2. నైనీ టెండర్ల వివాదం.. కృష్ణ భాస్కర్‌పై సర్కార్ వేటు 
  3. సీనియర్ ఐఏఎస్ సబ్యసాచి సింగరేణి సీఎండీ బాధ్యతలు 
  4. నిర్వహించిన ప్రతి శాఖలోనూ జ్యోతి బుద్ధ ప్రకాష్ ముద్ర

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : తెలంగాణలో పది మంది ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధప్రకాష్‌ను  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా  నియమించారు. ఇప్పటీవరకు సింగరేణి సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్న  కృష్ణ భాస్కర్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది.

ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి సబ్యసాచి ఘోష్ ప్రస్తుతం ఉన్న గిరిజన సంక్షేమ శాఖతో పాటు  ఎస్సీ అభివృద్ధి  శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెర్ప్ అడిషనల్  సీఈవోగా ఉన్న కాత్యాయనీ దేవి ని ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనీదేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఐఏ ఎస్ సందీప్‌కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంట ర్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టను న్నారు.

సెర్ప్ సీఈవోగా ఉన్న దివ్యకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషన ర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.  జలమండలి జేఎండీగా వయాంక మిట్టల్,  రఘురామ శర్మకు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శితో పాటు మంత్రి శ్రీధర్‌బాబుకు ఓఎస్‌డీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు విభజన తర్వాత ఏర్పాటు కానున్న జీహెచ్‌ఎంసీకి కమిషనర్‌గా, వినయ్‌కృష్ణారెడ్డిని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, జి. సృజన  సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ 

సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధప్రకాష్‌ను సింగరేణి సీఎండీగా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవలనే నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో వివాదం కావడం, ప్రభుత్వం వెంటనే ఆ టెండర్లను రద్దు చేయడం వెనువెంటనే జరగడంతో పాటు ఇప్పటి వరకు సీఎండీగా ఉన్న కృష్ణభాస్కర్‌ను ప్రభుత్వం తప్పించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జ్యోతిబుద్ధ ప్రకాష్ ( ఐఏఎస్  తెలంగాణ క్యాడర్ )  తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు  నిర్వహిస్తున్నారు. రవాణా శాఖ కమిషనర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించారు.

గతంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. బుద్ధప్రకాష్ నిర్వహించిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేశారు. సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు సింగరేణిలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో బుద్ధప్రకాష్‌ను ప్రభుత్వం సీఎండీగా నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత  సింగరేణి సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి  శ్రీధర్ సుదీర్ఘంగా పని చేశారు. ఆ తర్వాత ఎన్ బలరామ్, డి. కృష్ణభాస్కర్ సీఎండీలుగా పని చేశారు. ఇప్పుడు జ్యోతి బుద్ధ ప్రకాష్‌కు ప్రభుత్వం సింగరేణి సీఎండీ బాధ్యతలను అప్పగించింది.