26 March, 2026 | 3:37 AM

భూభారతి వచ్చినా తీరని భూ కష్టాలు

26-03-2026 01:41 AM

మంత్రి పొంగులేటికి గిరిజన సంఘం విన్నతి

రంగారెడ్డి, మార్చి 25( విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, ’ధరణి’ పోయి ’భూభారతి’ వచ్చినా క్షేత్రస్థాయిలో పేదల భూ సమస్యలకు మోక్షం కలగడం లేదని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్త్యావత్ హనుమనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్ తో కలిసి ఆయన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక భూ సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు.వివిధ సాంకేతిక కారణాల వల్ల ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు ఇంకా ’నిషేధిత జాబితా’ లోనే ఉండిపోయాయని, దీనివల్ల రాష్టంలో వేలాది మంది రైతులు తమ భూములపై హక్కులు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అత్యవసర అవసరాల కోసం కుంట లేదా ఎకరం, అర ఎకరా భూమి అమ్ముకోవాలన్నా, రికార్డుల్లోని తప్పుల వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో అర్హులైన గిరిజనులందరికీ పెండింగ్లో ఉన్న పోడు భూముల పట్టా సర్టిఫికెట్లను తక్షణమే పంపిణీ చేయాలని కోరారు.కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి వ్యవస్థలోనైనా పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం చేయాలని విన్నవించారు. గిరిజన నేతల విన్నపంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, ఎక్కడా పేద రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామనిచ్చారు.