calender_icon.png 6 June, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కగార్ యుద్ధంతో విప్లవోద్యమాన్ని నిర్మూలించలేరు..

31-05-2025 07:25:25 PM

కటకం సుదర్శన్ రెండో వర్ధంతి సభ.. 

సికాస మాజీ ప్రతినిధి ఎండి హుస్సేన్.. 

దివంగత మావో అగ్రనేత సుదర్శన్ కీ నివాళులు..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బిజెపి పాలకులు కగార్ యుద్ధ నరమేధంతో భారత నిర్మూలించలేరని సికాస మాజీ ప్రతినిధి మహమ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తిలో దివంగత మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ (ఆనంద్) రెండో వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం పెట్టుబడి దారుల ప్రయోజన కోసం దండకారణ్యంలో రక్తసిక్తం సృష్టిస్తుందన్నారు. దండకారణ్యంలో లోని సహజ సంపద, వనరులను అంబానీ, ఆదానీ,మిట్టల్ పెట్టుబడిదారులకు దోచి పెట్టేందుకు అడ్డుగా ఉన్నారని గిరిజనులను, మావోయిస్టులపై ఫాసిస్ట్ దమనకాండను సాగిస్తున్నారని మండిపడ్డారు.

మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ దండకారణ్యం లో జనతన సర్కార్ నిర్మాణంలో కీలక భూమిక వహించారన్నారు. పేద ప్రజలు, గిరిజనులు పీడిత ప్రజలు కలలుగన్న ప్రత్యామ్నాయ ప్రజారాజ్యాధికారానికి బీజం వేశారన్నారు. జనతన సర్కారును కూల్చివేసి దండకారణ్యంలో వనరులను దోచుకునేందుకే కగార్  యుద్ధాన్ని బిజెపి ప్రభుత్వం చేపట్టిందన్నారు. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును హత్య చేసినంత మాత్రాన విప్లవోద్యమం ఆగిపోదని స్పష్టం చేశారు. పెద్ద నాయకుల ప్రాణ త్యాగాల స్ఫూర్తితో మావోయిస్టు పార్టీ నూతన నాయకత్వoలో విప్లవోద్యమం మరింత బలోపేతం అవుతుందన్నారు.

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో 27 మంది విప్లవకారుల హత్యకాండపై ప్రపంచ, అంతర్జాతీయ స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికుతున్నదన్నారు. మావోయిస్టు ఉద్యమం ఆ పార్టీ కోసం కాదని, పీడిత ప్రజలకు దేశ సర్వసంపద దక్కడం కోసమేనీ, మానవాళి కోసం అని స్పష్టం చేశారు. దండకారణ్యంలో గిరిజనులు మావోయిస్టుల మీద బిజెపి ఫాసిస్టు ప్రభుత్వం చేస్తున్న మారడకాండ దేశ ప్రజలకు తీరని నష్టమని పేర్కొన్నారు. అది ప్రజలపై జరుగుతున్న యుద్ధమేనని, దానికి వ్యతిరేకంగా పట్టణ, మైదాన ప్రాంత ప్రజలు ఉద్యమించాలన్నారు. మావోయిస్టు అగ్ర నేతలు పెద్ది శంకర్, కటకం సుదర్శన్, గజ్జల గంగారం, గజ్జల సరోజ, పులి మదనయ్య ఎంతోమంది బెల్లంపల్లి సింగరేణి కార్మికుల పేద ప్రజల బిడ్డలు విప్లవోద్యంలో తన ప్రాణాలను త్యాగం చేశారన్నారు.

రెండు సంవత్సరాల క్రితం దండకారణ్యంలో నిర్మించిన జనతన సర్కార్ లో అసువులు బాసిన కటకం సుదర్శన్ కీ నిజమైన నివాళి విప్లవోద్యమంపై కగార్ యుద్ధకాండకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రజలు, కార్మికులు విద్యార్థులు, కర్షకులు, యువకులు కదిలి రావడమేనని పేర్కొన్నారు. బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శాంతక్క, పౌర హక్కుల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మా దన కుమారస్వామి, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు టి శ్రీనివాస్, డిటిఎఫ్ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, విరసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజన్న, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, వర్ధంతి సభ నిర్వహకుడు, కటకం సుదర్శన్ సోదరుడు కటకం సతీష్, సోదరులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్లవకళాకారుడు ఆడెపు సమ్మయ్య బృందం ఆలపించిన గీతాలు ఉర్రూతలు ఊగించాయి.

మావోయిస్టు నేత సుదర్శన్ కీ ఎమ్మెల్యే వినోద్ నివాళి..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీలో మావోయిస్టు అగ్రనేత దివంగత కటకం సుదర్శన్ కీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఘనంగా నివాళులు అర్పించారు. కటకం సుదర్శన్ అసువులు బాసి రెండు సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా ఆయన సోదరుడు కటకం సతీష్ శనివారం కటకం సుదర్శన్ రెండో వర్ధంతి నీ తన నివాస గృహంలో నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కటకం సుదర్శన్ రెండో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కటకం సుదర్శన్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి, నాయకులు మునిమంద రమేష్, దేవ రమేష్, ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి దేవసాని ఆనంద్, రాయలింగు, ఎలుక ఆకాష్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

కటకం సుదర్శన్ కి బీఆర్ఎస్ నేత ప్రవీణ్ నివాళి.. 

మావోయిస్టు అగ్రనేత దివంగత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కు బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుoట్ల ప్రవీణ్ ఘనంగా నివాళులర్పించారు. శనివారం కటకం సుదర్శన్ ద్వితీయ వర్ధంతినీ కన్నాలబస్తీలోని కటకం సుదర్శన్ సోదరుడు సతీష్ నివాసంలో చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుoట్ల ప్రవీణ్ దివంగత మావోయిస్టు నేత కటకం సుదర్శన్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజా కళామండలి జిల్లా కన్వీనర్ ఆడెపు సమ్మయ్య, కటకం సుదర్శన్ సోదరుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు.