టూ ఇన్ వన్!?
- హాస్టల్లో ఎంపీడీవో ఆఫీస్
- ఇటు విద్యార్థులకు, అటు అధికారులకు తీవ్ర ఇబ్బందులు
కేసముద్రం, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో ఎస్సీ సంక్షేమ (బాలుర) హాస్టల్లో మండల పరిషత్ కార్యాలయాన్ని నిర్వహిస్తుండడం వల్ల అటు ఎంపీడీవో కార్యాలయ నిర్వహణకు, ఇటు హాస్టల్ నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇనుగుర్తి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మండల పరిషత్ కార్యాలయాన్ని గతేడాది సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు అసౌకర్యంగా మారింది.
గతేడాది 50 మంది విద్యార్థులు హాస్టల్లో వసతి పొందగా, ఒక డార్మెటరీ హాల్ పూర్తిగా ఎంపీడీవో కార్యాలయానికి కేటాయించడంతో మిగిలిన ఒక డార్మె టరీలో సర్దుకుపోవాల్సి వచ్చింది. నూతన భవనం నిర్మించకపోవడంతో ఈ ఏడాది కూ డా హాస్టల్లోనే ఎంపీడీవో కార్యాలయం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది కూడా హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడు తూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఎంపీడీవో కార్యాలయానికి కేటాయించిన ఒక ఒక డార్మెటరీ హాల్లోనే జాతీయ ఉపాధి హామీ, మండల పరిషత్ కార్యాలయం నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని అధికారు లు వాపోతున్నారు. దీంతో అటు సంక్షేమానికి, ఇటు అభివృద్ధికి ఆటంకంగా మారింది.






