దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ
నడిరోడ్డుపై నుజ్జునుజ్జు అయిన లారీలు
గంటల తరబడి ట్రాఫిక్ జామ్
(కూసుమంచి),(విజయక్రాంతి): తిరుమలయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామ పరిధిలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై(Warangal–Khammam National Highway) సోమవారం ఉదయం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదంలో లారీలకు నుజ్జునుజ్జు అయ్యాయి. గణనీయమైన నష్టం వాటిల్లింది. ఒక లారీలో బొప్పాయి కాయలు లోడ్ చేసి ఉండగా, ప్రమాదం తర్వాత అవి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి బొప్పాయి కాయలను తీసుకెళ్తున్నారు. ప్రమాదం కారణంగా రెండు లారీలు రోడ్డుకి ఇరుపక్కల అడ్డంగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..






