calender_icon.png 22 June, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉద్యోగులకు 2 శాతం డీఏ

22-06-2025 12:26:07 AM

  1. --  71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టిజన్లకు ప్రయోజనం 
  2. జనవరి నుంచి డీఏ అమల్లోకి వస్తుంది..
  3. డిప్యూటీ సీఎం మంత్రిభట్టి విక్రమార్క మల్లు స్పష్టం 

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభు త్వం శుభవార్త చెప్పింది. ఆ శాఖ ఉద్యోగులకు రెం డు శాతం డీఏ పెంచుతున్నట్లు శనివారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. ఇది ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి వస్తోందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలవాలని, అందుకు తగిన విధంగా రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముం దుకు వెళ్తుందన్నారు.

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 1.944 శాతానికి డీఏని పెంచి ఇవ్వాలని  ప్రభుత్వం గతంలోనే నిర్ణయించినట్టు గుర్తుచేశారు. తాజా నిర్ణయంతో విద్యుత్‌శాఖ పరిధిలో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతంలో 14.074 శాతంగా ఉన్న డీఏను.. 16.018 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెంచిన డీఏతో విద్యుత్ సంస్థపై ప్రతి నెలా రూ.11.193 కోట్ల భారం పడుతుందన్నారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్..

మనిషి జీవించేందుకు ఆక్సిజన్ ఎంత అవసరమో.. ఇప్పటి ప్రపంచానికి విద్యుత్ ఉత్పత్తి అనివార్యమైందని డిప్యూటీ సీఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ రాగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చిందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే, విద్యుత్ డిమాండ్ అదనంగా 2000 మెగావాట్లు అదనమని తేల్చిచెప్పారు. 

అయినప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు ఓ కుటుంబంలా శ్రమించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరాను చేశారని కొనియాడారు. 2029 నాటికి రాష్ట్రంలో 26,299 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని, 2034--35 నాటికి అది 33,773 మెగావాటకు చేరుకుంటుందని అంచనా వేశారు. తమప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025 అమలు చేస్తున్నదని, 2029 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు.

సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు రత్నాకర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేత శివాజీ, 1104 యూనియన్ నేత సాయిబాబా, 327 యూనియన్ నేత శ్రీధర్, పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నేత బేసిరెడ్డి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నేత శ్యాం మనోహర్, 1535 యూనియన్ నేత వజీర్, పెన్షనర్స్ అసోసియేషన్ నేత సత్యనారాయణ, టీఆర్‌వీకేఎస్ యూనియన్ నేత కరెంట్ రావు పాల్గొన్నారు.