07-01-2026 03:36:51 PM
యాచారం: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడడంతో తీవ్రంగా కలత చెందిన యువకుడు తాను కూడా తనువు చాలించాడు. ఈ రెండు ఘటనలతో మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది. మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ (17) మహేష్ (20) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి కుటుంబీకులకు తెలిసి మందలించారు. కొంతకాలంగా యువతి, మహేష్ ను దూరం పెట్టింది.
దీనితోపాటు యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మహేష్, యువతికి ఫోను చేసి తాను లేకుండా ఉండలేనని తెగేసి చెప్పడంతో తీవ్రంగా కలత చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు బుధవారం హయత్ నగర్ మండల పరిధిలోని తొర్రూరు గ్రామంలోని ఒక వెంచర్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో మేడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో యువతి, యువకుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.